Lockdown 4.0 Terms

 


లాక్‌డౌన్‌ 4.0 నిబంధనలు



లాక్‌డౌన్‌ 3.0 గడువు ఆదివారంతో ముగుస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ఉత్కంఠ అందరిలో వ్యక్తమవుతోంది. భవిష్యత్తు కార్యాచరణపై ఈనెల 11న ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. అన్ని రాష్ట్రాలు బ్లూప్రింట్స్‌ పంపాలని సూచించారు. దానికి గడువు శుక్రవారంతో ముగిసింది. అందిన సూచనలు ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. జోన్లు/ హాట్‌స్పాట్ల నిర్ణయం, ఆంక్షల అమలుపై ఈసారి రాష్ట్రాలకు మరింత నిర్ణయాధికారం కల్పించవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఒక నిర్ణీత ప్రాంతంలో ప్రజల కదలికల్ని, ఆర్థిక కార్యకలాపాలను అనుమతించడానికి, లేదా నియంత్రించడానికి రాష్ట్రాలకు దానివల్ల వీలుంటుంది.
‘అవసరాలకు అనుగుణంగా’ రైళ్లను, దేశీయ విమాన సర్వీసులను వచ్చేవారం నుంచి పరిమితంగా పునఃప్రారంభించేలా నిర్ణయాలు ఉండవచ్చని తెలుస్తోంది.
ఇప్పటికే పరిమిత సంఖ్యలో రైళ్లు నడుపుతుండటం వల్ల భవిష్యత్తులో భౌతిక దూరం పాటిస్తూ విమాన, బస్సు సర్వీసులు, వ్యక్తిగత వాహనాలు, ఆటోలు, ట్యాక్సీలూ తిరగడానికి అవకాశం కల్పించొచ్చని తెలుస్తోంది.
కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాలు లేనిచోట్ల స్థానిక రైళ్లు, మెట్రోలను పరిమిత సామర్థ్యంతో నడిచేలా అనుమతిస్తారని వినిపిస్తోంది.


ఎక్కువ అవకాశాలకు రాష్ట్రాల వినతి
ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు నడవడానికి అవకాశం కల్పించాలని కేరళ, కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, దిల్లీ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాయి. 18వ తేదీ నుంచి 50% సిబ్బంది కార్యాలయాలకు రావాలని తమిళనాడు ఉత్తర్వులు జారీ చేసింది. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగనివ్వాలని ఆ రాష్ట్రం కోరుతోంది. రెస్టారెంట్లు, వ్యాయమశాలలు, గోల్ఫ్‌కోర్స్‌లు తెరవడానికి అనుమతించాలని కర్ణాటక అంటోంది. సోమవారం నుంచి కేంద్రం పెద్దఎత్తున సడలింపులు ఇస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప విలేకరులకు చెప్పారు.
కంటెయిన్‌మెంట్‌ జోన్లలో మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తేసి వ్యాపార కార్యకలాపాలకు అనుమతించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరారు.
మెట్రో రైళ్లు, స్థానిక రైళ్లు, దేశీయ విమానాలు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరవడానికి వీలు కల్పించాలని కేరళ అడిగింది.
పట్టణ ప్రాంతాల్లో అన్నిరకాల వ్యాపార కార్యకలాపాలకు అనుమతించాలన్నది గుజరాత్‌ డిమాండ్‌.
మహారాష్ట్ర మాత్రం లాక్‌డౌన్‌ మినహాయింపులకు ఏమాత్రం సుముఖంగా లేదు. వలస కూలీల రాకతో ఇబ్బందులు పడుతున్న ఝార్ఖండ్‌, ఒడిశాలు లాక్‌డౌన్‌కే మొగ్గు చూపుతున్నాయి.
బిహార్‌, మిజోరం రాష్ట్రాలు మే 31వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే డిమాండ్‌ చేశారు.