Release of guidelines for digital‌ classes

         డిజిటల్‌ క్లాసులకు మార్గదర్శకాలు విడుదల


 




  • ప్రీస్కూల్‌ విద్యార్థులకు 45 నిమిషాలే

  • 1 నుంచి 5వ తరగతివరకు గంటన్నరపాటు

  • 6 నుంచి 8వ తరగతులవారికి 2 గంటలు

  • 9-12వ తరగతులకు 3 గంటలు మించొద్దు

  • డిజిటల్‌ క్లాసులకు మార్గదర్శకాలు విడుదల

  • పాఠశాలల్లో ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు అనుమతి

  • డిజిటల్‌ సదుపాయాల్లేని విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లుచేయాలని టీచర్లకు ఆదేశం


 రాష్ట్రంలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి డిజిటల్‌ (ఆన్‌లైన్‌) విధానంలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలను జారీచేసింది. విద్యార్థులకు డిజిటల్‌ విధానంలో పాఠాలు చెప్పే క్రమంలో అనుసరించాల్సిన విధివిధానాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన మంగళవారం విడుదలచేశారు. ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో డిజిటల్‌ పాఠాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రగ్యాత అనే పేరుతో విడుదలచేసిన మార్గదర్శకాలు ఎస్సీఈఆర్టీ వెబ్‌సెట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను అమలుచేయాల్సి ఉందన్నారు. కిండర్‌గార్డెన్‌, నర్సరీ, ప్లేస్కూల్‌, ప్రీస్కూల్‌ విద్యార్థులకు గరిష్ఠంగా రోజూ 45 నిమిషాలకు మించకుండా వారానికి మూడ్రోజులు మాత్రమే బోధన జరుగాలని పేర్కొన్నారు. అదికూడా పెద్దలు లేదా తల్లిదండ్రుల సమక్షంలో జరుగాలని స్పష్టంచేశారు. 


ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రోజూ రెండు తరగతుల చొప్పున వారంలో ఐదు తరగతులకు మించి తీసుకోరాదని తెలిపారు. గరిష్ఠంగా ఒకటిన్నర గంటలే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. 6 నుంచి 8వ తరగతుల వారికి రోజుకు 30 నుంచి 45 నిమిషాలు మించకుండా మూడు సెషన్లలో క్లాసులు తీసుకోవాలని తెలిపారు. గరిష్ఠంగా రెండు గంటలే బోధించాలని  పేర్కొన్నారు. 9-12వ తరగతి వరకు ఒక్కో క్లాసు 30-45 నిమిషాలకు మించకుండా.. నాలుగు సెషన్లలో బోధన సాగాలని, మొత్తంగా రోజుకు 3 గంటలు మించకూడదని స్పష్టంచేశారు.


ప్రధానోపా ధ్యాయుల పా త్ర..


డిజిటల్‌ పాఠాల బోధనలో ప్రధానోపాధ్యాయులకు కూడా మార్గదర్శకాలు జారీచేశారు. గురువారం నుంచి టీచర్లు, సిబ్బంది కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఈ-లెర్నింగ్‌ విధానాన్ని వెనకబడిన ప్రాంతాల విద్యార్థులందరికీ అందుబాటులో తేవాలి. డిజిటల్‌ పాఠాలు అందరికీ అందించాలి. 1.టీసాట్‌/దూరదర్శన్‌ చానెల్‌. 2.స్మార్ట్‌ఫోన్‌, మొబైల్‌/ ల్యాప్‌టాప్స్‌/ కంప్యూటర్లు ఇంటర్నెట్‌తో ఉండడం. 3.విద్యార్థులకు టీసాట్‌/దూరదర్శన్‌, స్మార్ట్‌ఫోన్లు/మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌ లేనివారిని వేర్వేరుగా గుర్తించాలి. విద్యార్థులకు టీవీ అందుబాటులో లేకపోతే ప్రధానోపాధ్యాయులు గ్రామ పంచాయతీ, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి డిజిటల్‌ పాఠాల కోసం సహకారం పొందాలి. టీవీలు అందుబాటులో ఉన్న విద్యార్థులతో టీవీలులేనివారిని జత చేయాలి. స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారి సేవలు ఉపయోగించుకోవాలి 


రెండు స్థాయిల్లో బోధన


ఎస్సీఈఆర్టీ ప్రత్యామ్నాయ విద్యాక్యాలండర్‌ ప్రకారం రెండుస్థాయిల్లో బోధించాలి. లెవల్‌-1.. లెర్నింగ్‌ అవుట్‌ కమ్స్‌, (రెమిడియల్‌), లెవల్‌-2.. వర్క్‌షీట్లు ఆధారంగా లెర్నింగ్‌ అవుట్‌ కమ్‌ను సాధించడం. ఐదో వారం నుంచి స్కూళ్లు/టీచర్లు వర్క్‌షీట్లు స్థాయిలవారీగా రూపొందించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువాలి. డిజిటల్‌ పాఠాల కోసం పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, ఇంటర్నెట్‌ సౌకర్యంతో స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ ఉపయోగిస్తే దానివల్ల కలిగే సైబర్‌ ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.


టీచర్ల పా త్ర..



  • స్కూళ్లలో డిజిటల్‌ పాఠాలు అందించడానికి కావాల్సిన సదుపాయాలు విద్యార్థులకు తరగతులవారీగా అందుబాటులోకి తీసుకురావాలి. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు ఇలా రకరకాలుగా వేర్వేరుగా విభజించి అవసరాలకునుగుణంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. 

  • తరగతులవారీగా విద్యార్థులు డిజిటల్‌ పాఠాలు వినడానికి తగిన సదుపాయాలను టీచర్లు కల్పించాలి. టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా ప్రసారాల గురించి విద్యార్థులకు తెలియజేయాలి. ప్రతి క్లాస్‌ తర్వాత విద్యార్థులకు దూర విద్యావిధానంలో వర్క్‌షీట్లతో పాఠాలను ప్రాక్టీస్‌ చేయించాలి. విద్యార్థులకు హోంవర్క్‌ ఇచ్చి.. వాటిని ఎంతవరకు పూర్తిచేశారో పర్యవేక్షించాలి.


ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు


2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు కల్పించడానికి ప్రభుత్వం అనుమతి కల్పించింది. పై తరగతులకు వెళ్లేవారి వివరాలు స్కూళ్లలో సిద్ధంగా ఉన్నాయి. అడ్మిషన్ల కోసం విద్యార్థులు భౌతికంగా స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. బడి బయట పిల్లలను, వలస కార్మికుల పిల్లలను, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను కూడా గుర్తించాలి. వారికి కూడా డిజిటల్‌ బోధన కొనసాగించాలి. అడ్మిషన్ల వివరాలను సమగ్ర శిక్షా అభియాన్‌ వెబ్‌సైట్‌లో ఉన్న ‘ఛైల్డ్‌ ఇన్ఫో అప్లికేషన్‌'లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు.