మందులకు లొంగని రోగాలు
మందులకు లొంగని రోగాలు



                        పటాన్‌చెరు, జిన్నారం, అమీన్‌పూర్‌ మండలాల్లో భయానక పరిస్థితులు


 


 


                  


          వ్యాధులు ఎవరికైనా వస్తాయి. మందులు వాడితే తగ్గుతాయి. కాని అక్కడి ప్రజలకు మాత్రం వ్యాధులు రావడమే కాని తగ్గడం కష్టం. తగ్గాలంటే మోతాదు మించి మందులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ ఔషధాల కంటే వాటిని వ్యాప్తి చేసే బ్యాక్టీరియాకే బలమెక్కువ. అంతేకాదు. ఇక్కడ గర్భస్రావాలూ, శిశుమరణాలూ ఎక్కువ. ప్రాణాంతక క్యాన్సర్లు, నిత్యం నరకం చూపించే చర్మ వాధులకు లెక్కేలేదు. పటాన్‌చెరు, జిన్నారం, అమీన్‌పూర్‌ మండలాల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల దుస్థితి ఇది.


          కాలుష్యం, దానివల్ల తలెత్తే దుష్పరిణామాలు ఇక్కడ కొత్తకాకపోయినా నానాటికీ అదుపు తప్పుతుండటమే ఆందోళనకు గురిచేస్తోంది. యాంటీ బయాటిక్స్‌కు లొంగని వ్యాధుల రూపంలో ఇప్పుడు కొత్త ముప్పు ముంచుకొస్తోంది. పర్యావరణ హానికారకాలపై పరిశోధన జరిపే నెదర్లాండ్స్‌కు చెందిన 'ఛేంజింగ్‌ మార్కెట్స్‌ అండ్‌ ఎకో సిస్టమ్స్‌' అనే సంస్థ నిపుణులు ఇటీవల ఇక్కడ నిర్వహించిన సర్వేలో ఇలాంటి అంశాలెన్నో వెల్లడయ్యాయి. 'ఈనాడు' బృందం ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఒళ్లు గగుర్పొడిచే అంశాలెన్నో బయటపడ్డాయి.


 


ప్రా ణాంతక పరిస్థితులు


పారిశ్రామికవాడలు, ఔషధ తయారీ పరిశ్రమల నుంచి విచ్చలవిడిగా విడుదలవుతున్న వ్యర్థాల వల్ల పరిసరాలు తీవ్రమైన కాలుష్యానికి గురవుతున్నాయి. విష వ్యర్థాల వల్ల చెరువులు, కుంటలు, వాగులతోపాటు భూగర్భజలాలు కూడా కలుషితం అవుతున్నాయని నెదర్లాండ్స్‌ నిపుణుల బృందం ఇక్కడ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఔషధ వ్యర్థాల కారణంగా ఇక్కడి బ్యాక్టీరియాలో నిరోధకత పెరుగుతోందని, అందుకే యాంటీబయాటిక్‌ మందులు పనిచేయడంలేదని నివేదిక వెల్లడించింది. పరిసర ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.





























రోగాలపాలు


        టాన్‌చెరు మండలంలోని ఇస్నాపూర్‌ గ్రామంలో 2 ఆసుపత్రులు, 9 క్లినిక్‌లు ఉన్నాయి. ఒక్కో డాక్టర్‌ వద్దకు రోజుకు సగటున 90-110 మంది రోగులు వస్తుంటారు. ఏ చిన్న రోగమైనా వైద్యులు వారికి నేరుగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స మొదలుపెడుతున్నారు. ఫలితం ఉండకపోవడంతో మోతాదు పెంచుతున్నారు. ఏదైనా వ్యాధి తగ్గనప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్‌ ఇవ్వాలి. కాని ఇక్కడ ఏ రోగమైనా చికిత్స యాంటీబయాటిక్స్‌తోనే మొదలుపెడుతుండడం గమనార్హం. మామూలుగా జ్వరం వస్తే కొద్ది రోజుల్లో తగ్గుతుంది. ఈ ప్రాంతంలో మాత్రం శక్తిమంతమైన మందులు వాడినా నాలుగైదురోజులపైనే పడుతోంది.

గర్భం నిలబడటం కష్టమే


          కాలుష్యం వల్ల గర్భస్రావాలు పెరుగుతున్నాయి. 'ఈనాడు' బృందం పర్యటించిన ప్రతి గ్రామంలోనూ అనేకమంది ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఎంతమందికి గర్భస్రావమైందనే వివరాలు అందుబాటులో లేవు. చాలామంది మహిళలు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు వెళుతుంటారు. అక్కడే గర్భస్రావం అవుతుంది కాబట్టి వాటిపై కచ్చితమైన సమాచారం లేదు. బోరునీరు తాగడం తగ్గించిన తర్వాత కొంత తగ్గినట్లు తెలుస్తోంది.

నిస్సత్తువగా విద్యార్థులు


         వాయు కాలుష్యం తలనొప్పి, దగ్గుతో పాటు గుండెజబ్బుల వంటి సమస్యలకు దారితీస్తోంది. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతోంది. గాలిలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోవడంతో విద్యార్థులు శారీరకంగా నిస్సత్తువకు గురై పరుగెత్తలేని పరిస్థితి కొన్నిచోట్ల నెలకొని ఉంది.

                         



ఈ చెరువులు బాగుపడతాయా!


                     


ఆసానికుంట చెరువులో ఎలక్ట్రిక్‌ కండక్టివిటీ 13,000 మైక్రోగ్రాములు ఉంది. పరిమితికంటే ఇది దాదాపు 30 రెట్లు అధికం.
ఇస్నాపూర్‌ చెరువు నీటిలో ఎలక్ట్రిక్‌ కండక్టివిటీ నిర్దేశిత పరిమితి కంటే 20 రెట్లు అధికంగా ఉంది. 400-500 మైక్రోగ్రాములు ఉండాల్సిన చోట.. 9000 నమోదైంది.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలోని గండిగూడెం చెరువు నీటిని గతంలో తాగడానికి ఉపయోగించేవారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలతో ఇది పూర్తిగా కలుషితమైంది.
ఈ చెరువు నీటిని 'ఈనాడు' ఓ ల్యాబ్‌లో పరీక్ష చేయించింది. సీపీసీబీ పరిమితుల ప్రకారం- లీటర్‌ నీటిలో ఎలక్ట్రికల్‌ కండక్టివిటీ కనిష్ఠంగా 500, గరిష్ఠంగా 2000 మైక్రోగ్రాములు ఉండాలి. కానీ ఇక్కడ 3,400 ఎంజీలు ఉంది.


                 



కాలుష్యంతో గర్భస్రావాలు


                                                  


        కాలుష్యం వల్ల మహిళలు గర్భస్రావాలు, క్యాన్సర్‌, యుక్తవయసులోనే మధుమేహంÅ, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఐనవోలు గ్రామానికి చెందిన బట్టలు ఉతికే ఓ మహిళ గర్భంతో ఉన్నప్పుడు నక్కవాగులో ఉతకడం వల్ల కలుషిత జలాల ప్రభావం కడుపులో బిడ్డపై పడింది. అంధబాలిక జన్మించింది గతంతో పోలిస్తే గర్భస్రావాలు కొంత తగ్గినా సమస్య సమసిపోలేదు.


-డాక్టర్‌ కిషన్‌రావు, యశోధర ఆసుపత్రి పటాన్‌చెరు



పిల్లలు, వృద్ధులపై ప్రభావం తీవ్రం


                                               


        ఇక్కడి ప్రజల్లో వ్యాధి నిరోధకత తగ్గుతోంది. నరాలు చచ్చుబడిపోతున్నాయి. సాధారణ మందులు ఇస్తే జబ్బు తగ్గడం లేదు. నేరుగా యాంటీ బయాటిక్స్‌తో చికిత్స మొదలుపెట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా 10 ఏళ్లలోపు చిన్నారులు, 50 ఏళ్ల పైబడిన వారికి యాంటీ బయాటిక్స్‌ ఇచ్చినప్పటికీ వారు జబ్బుల నుంచి కోలుకోవడం లేదు.


- డాక్టర్‌ దయాకర్‌రెడ్డి, రామిరెడ్డి మెమోరియల్‌ ఆసుపత్రి, ఇస్నాపూర్‌